యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ప్రమాదకర పరిణామమన్న భారత్

  • యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి
  • ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత్‌
  • సంయమనం పాటించాలని పిలుపు
  • ఇది ఉగ్రవాద చర్యేనని, ప్రతీకారం తీర్చుకుంటామ‌న్న‌ యూఏఈ
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా, యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. యూఏఈకి దాదాపు 25 శాతం విద్యుత్‌ను అందించే ఈ కీలక కేంద్రంపై దాడి జరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి పట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఇవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. తక్షణమే ఇరు పక్షాలు సంయమనం పాటించి.. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి" అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.

దాడిలో ఎలాంటి ప్రాణనష్టం, రేడియేషన్ లీక్ జరగలేదు: యూఏఈ
యూఏఈ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ స్థాయిలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. పశ్చిమ సరిహద్దు నుంచి మూడు డ్రోన్లు దేశంలోకి ప్రవేశించాయని, వాటిలో ఒకటి అణు కేంద్రం లోపలి ప్రాంగణంలో పడగా, మరో రెండింటిని కూల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడిని "అకారణంగా జరిగిన ఉగ్రవాద చర్య"గా యూఏఈ ప్రభుత్వం అభివర్ణించింది. తమ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఎలాంటి చర్యలను సహించబోమని, ప్రతీకారం తీర్చుకునే పూర్తి హక్కు తమకుందని హెచ్చరించింది.

దాడి జరిగిన వెంటనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ దేశాలన్నీ దాడిని ఖండిస్తూ యూఏఈకి మద్దతు ప్రకటించాయి. యూఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ మాట్లాడుతూ, ఈ దాడి వెనుక ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థల హస్తం ఉండొచ్చని ఆరోపించారు.

అరబ్ ప్రపంచంలో ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బరాకా ప్లాంట్‌ను దక్షిణ కొరియా సహాయంతో యూఏఈ నిర్మించింది. 2020లో ఇది కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ ప్లాంట్‌పై దాడి జరగడం ఇదే మొదటిసారి. గతంలో యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ ప్లాంట్‌పై దాడికి యత్నించినట్లు ప్రకటించినా, యూఏఈ దాన్ని ఖండించింది. ఈ తాజా ఘటనతో పశ్చిమాసియాలో ఇప్పటికే బలహీనంగా ఉన్న శాంతి యత్నాలకు మరింత విఘాతం కలిగినట్లయింది.

Barakah Nuclear Power Plant
UAE
drone attack
India
Middle East tensions
nuclear security
foreign affairs
Yemen Houthi rebels
Iran
Anwar Gargash

More Telugu News